సహాయక చర్యలు కొనసాగుతున్నాయి : మంత్రి జగదీశ్ రెడ్డి

by  |
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి : మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మొదటి యూనిట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించిందని ఆయన వివరించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదం కారణంగా నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు పదిమంది బయటకు వచ్చారని.. ఇంకా లోపల తొమ్మిది మంది చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే సొరంగం లోపల దట్టమైన పొగ వ్యాపించడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని మంత్రి తెలిపారు.

ఇప్పటికే ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లారని, దట్టమైన పొగ కారణంగా వారు మూడు సార్లు లోపలికి వెళ్లి వెనక్కు వచ్చారని వివరించారు. ఆక్సిజన్ తో వెళ్లినా కూడా సంఘటనా స్థలానికి వెళ్లలేకపోతున్నారన్నారు. ఏన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే సింగరేణి సిబ్బంది సహాయం కూడా కోరినట్లు మంత్రి తెలిపారు. లోపల ఉన్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని.. వారంతా సేఫ్ గానే ఉన్నారని మంత్రి చెప్పారు.



Next Story