రహానేపై కెప్టెన్సీ ప్రెజర్ ఉండదు : గవాస్కర్

by  |
రహానేపై కెప్టెన్సీ ప్రెజర్ ఉండదు : గవాస్కర్
X

ముంబయి: ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. దీంతో చివరి మూడు మ్యాచ్‌లకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో రహానేపై కెప్టెన్సీ ఒత్తిడి పడుతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, వారి వ్యాఖ్యలను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తోసిపుచ్చాడు. రహానే కేవలం మూడు మ్యాచ్‌లకే నాయకత్వం వహించనున్నాడు కాబట్టి అతడు ఒత్తిడికి గురయ్యే అవకాశమే లేదన్నాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో గవాస్కర్ మాట్లాడుతూ, ‘రహానే భారత టెస్టు జట్టుకు ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా కెప్టెన్సీ చేశాడు.

ఇదే ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లకు రహానేనే కెప్టెన్సీ వహించాడు. కాబట్టి కెప్టెన్సీ బాధ్యతలు ఎలా నిర్వహించాలో అతనికి తెలుసు. పైగా అతడు మూడు మ్యాచ్‌లకే సారథ్యం వహించనున్నాడు. కావున అతడు ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉండదు’ అని తెలిపారు. కాగా, కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఆసీస్ గడ్డపై 2-1తో బోర్డర్-గవాస్కర్(2018-19) ట్రోఫీ దక్కించుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా మొదటి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. దీంతో చరిత్రను పునరావృతం చేయాలంటే టీమిండియా చాలా కష్టపడాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story