ధరణి‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు సక్సెస్: సీఎస్

by  |
ధరణి‌ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు సక్సెస్: సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు విజయవంతమైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ప్రకటించారు. నవంబరు రెండో తేదీన ప్రారంభించిన లావాదేవీలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 66,614 లావాదేవీలతో రూ.106.15 కోట్ల రెవెన్యూ సమకూరినట్లు చెప్పారు. వెబ్ పోర్టల్ కూడా 1.35 కోట్ల హిట్లు సాధించింది. ప్రస్తుతం సేల్, గిఫ్ట్, విరాసత్, పార్టిషన్, మార్ట్ గేజ్ వంటి డీడ్స్ చేస్తున్నారు. ట్రైబల్ ఏరియాలోనూ 483 దరఖాస్తులు అందాయి. 253 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు చెప్పారు. పెండింగ్ మ్యుటేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 18,199 దరఖాస్తుల ద్వారా మ్యుటేషన్ ఫీజు రూ.3.57 కోట్లు అందినట్లు వివరించారు. 365 దరఖాస్తుల ద్వారా 545 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చగా రూ.49.15 కోట్లు లభించిందన్నారు.

త్వరలో మిగతా సేవలు
బ్యాంకులకు మార్ట్ గేజ్ చేసేందుకు, తొలగించేందుకు త్వరలోనే మాడ్యూల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. అలాగే కోర్టు కేసుల వివరాలను అప్ లోడ్ చేసేందుకు, భూములను బ్లాక్ చేసేందుకు, తొలగించేందుకు కలెక్టర్లకు లాగిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎన్ఆర్ఐలకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసే ప్రక్రియ నడుస్తున్నట్లు చెప్పారు. వారికి కలెక్టర్లు ఆమోదిస్తే తహశీల్దార్లు పాసు పుస్తకాలు జారీ చేస్తారన్నారు. వారం రోజుల్లోనే పట్టాదారు పాసు పుస్తకం యజమాని ఇంటికే వచ్చేటట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధరణి వెబ్ సైట్‌లో సర్వే నంబర్ల వారీగా, సబ్ డివిజన్ల వారీగా మ్యాపులను వీక్షించేటట్లు ఏర్పాటు చేస్తామన్నారు. జీపీఏ, ఎస్ జీపీఏ మాడ్యూల్స్‌ను డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు.

Next Story

Most Viewed