పోటెత్తిన వరద.. ప్రాణం తీసుకున్న రైతు

by  |
Farmer suicide
X

దిశ, నల్లబెల్లి: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను దళారులు, వడ్డీ వ్యాపారులే కాదు ఒక్కోసారి వాన దేవుడు కూడా చిక్కుల్లో నెట్టుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా పంట మొత్తం వరదపాలు కావడం, అప్పులు పెరగడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… లెంకాలపల్లి గ్రామానికి చెందిన కీసరి సాయిలు(58)కి ఒక ఎకరం భూమి ఉంది. దీంతో అప్పు తెచ్చి ఆ భూమిలో వరిసాగు చేశాడు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీట మునిగిపోయింది. అంతేగాకుండా.. గతకొన్ని రోజులుగా అనారోగ్యం సాయిలును వెంటాడుతోంది. పంట చేతికి రాగానే అప్పులు తీర్చాలని భావించిన సాయిలుకి వర్షాలు భారీ షాక్ ఇవ్వడంతో సాయిలు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఓ వైపు కుటుంబ పోషణ కూడా భారం అవుతుండటంతో చేసేదేంలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed