మా సమస్య పరిష్కరించండి.. హైకోర్టు సీజేకు అచ్చంపేట విద్యార్థుల లేఖ

by  |
మా సమస్య పరిష్కరించండి.. హైకోర్టు సీజేకు అచ్చంపేట విద్యార్థుల లేఖ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలకు గత 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే విద్యాభ్యాసం పూర్తి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం పాఠశాల విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

మా సమస్యకు పరిష్కారం చూపండి..

గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. మా పాఠశాలలో ఉర్దూ బోధించే ఉపాధ్యాయుడితో పాటు మిగతా ఏ ఒక్క ఉపాధ్యాయుడిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నియమించలేదు. ఈ విషయాన్ని స్థానిక మండల, జిల్లా విద్యాధికారి, ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాము. అయినప్పటికీ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు, సమస్య తీరలేదు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులతో మా తల్లిదండ్రులు కలిసి ఇంటింటికీ తిరిగి ఈ పాఠశాలలో బాలురు 47, బాలికలు 43 మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరంలో విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు లేకపోవడం వలన బాలల విద్యా హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

90 మంది విద్యార్థులకు ఒకే ఒక్కడు..

అయితే ప్రభుత్వం కంటితుడుపు చర్య మాదిరిగా మండలంలోని మాచారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎల్లయ్య అనే ఒక్క ఉపాధ్యాయుడిని మాత్రమే డిప్యుటేషన్‌పై పంపినట్టు తెలిపారు. ఆయనే విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. 90 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

కావున ఒక ఉపాధ్యాయుడితో మా విద్యార్థులకు న్యాయం జరగడంలేదని, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకపోవడం వలన నాణ్యమైన విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారని, ఇది ముమ్మాటికీ పిల్లల హక్కుల ఉల్లంఘనే అని ఆ లేఖలో తెలిపారు. మా సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నామని విద్యార్థులు, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి బియ్యాన్ని వెంకటేష్, బాలల హక్కుల పర్యవేక్షణ వేదిక కో-కన్వీనర్ నాయక్ జమీల్, జమా మసీద్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ లేఖను హైకోర్టు న్యాయమూర్తి‌కి పోస్ట్ చేశారు.


Next Story

Most Viewed