ఆ విద్యార్థిని మృతికి అతడే కారణమా..?

by  |
ఆ విద్యార్థిని మృతికి అతడే కారణమా..?
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై ఆమె స్నేహితురాలి మేన మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం… పిక్లా నాయక్ తండాకు చెందిన విద్యార్థిని (20) నల్లగొండలోని చర్లపల్లి గురుకుల డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. పీజీ ఎంట్రన్స్ కోసం కోచింగ్ సెంటర్ లో జాయిన్ కావాలని ఆమె అనుకుంది.

ఈ మేరకు అక్టోబర్ 29న కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్ కావడానికి హైద్రబాద్‌కు ఆమె తన తండ్రితో కలిసి బయలు దేరింది. ఈ క్రమంలో నార్కట్ పల్లిలో వారికి తన స్నేహితురాలు మేనమామ రాజశేఖర్ కలిశాడు. కోటేశ్వరిని తాను హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్‌లో చేరుస్తానని ఆమె తండ్రితో అతను నమ్మబలికాడు. అనంతరం ఆమెను అతను తీసుకుని వెళ్లాడు. మత్తు మందు ఇచ్చి ఆమె పై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఘట్ కేసర్ లోని ఓ హాస్టల్‌లో ఆమెను వదిలి వెళ్ళాడు.

కాగా విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం రావడంతో ఆమె తండ్రికి శుక్రవారం ఫోన్ చేసింది. దీంతో ఆమెను తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యుల సూచన మేరకు ఆమెను ఖమ్మం తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు తండ్రి వాపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story