లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై కేసులు: ఎస్పీ రెమా రాజేశ్వరీ

by  |
లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై కేసులు: ఎస్పీ రెమా రాజేశ్వరీ
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాధి నిర్మూలనకు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లాలో ఆయా ప్రాంతాలను కలిపే రహదారులు, కూడళ్లలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చీపోయే వాహనాలు, వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పట్టణంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అలాగే రోడ్లపైకి వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని నిబంధన పెట్టామన్నారు. దీనిని బేఖాతరు చేసే వారిని గుర్తించి పోలీసు అధికారులు ఫొటోలు తీస్తున్నారన్నారు. నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై కేసుల నమోదు, జరిమానా తప్పదని హెచ్చరించారు. ఇకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాస్కులతోపాటు సామాజిక దూరం పాటించేలా, దుకాణ యజమానులు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. క్లస్టర్ ప్రాంతాలు, క్వారంటైన్ పద్ధతుల్లో ఎలాంటి మార్పులు, మినహాయింపులు ఉండవన్నారు.

Tags: corona, lockdown, strict rules, sp rema rajeshwari, drone camera using



Next Story