బయటకు వచ్చారో శిక్ష తప్పదు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

by  |
బయటకు వచ్చారో శిక్ష తప్పదు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
X

దిశ, శేరిలింగంపల్లి : కోవిడ్ నియంత్రణకు గాను ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్. లాక్‌‌డౌన్ ప‌రిశీలన‌లో భాగంగా గురువారం స‌జ్జనార్ చందాన‌గ‌ర్‌, మియాపూర్ పోలీస్‌ స్టేష‌న్‌‌ల ప‌రిధిలోని పలు ప్రాంతాల్లో ప‌ర్యటించారు. వాహ‌నదారుల‌ను తానే స్వయంగా ఆపి ఎక్కడికి వెళుతున్నారు, బయట తిరగడానికి గలా కారణాలు ఏంటని ఆరా తీశారు.

ఈ సంద‌ర్భంగా స‌జ్జనార్‌ మాట్లాడుతూ.. క‌రోనా ఉదృతిని క‌ట్టడి చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం లాక్‌‌డౌన్ విధించింద‌ని, ఈనెల 30 వ‌ర‌కు లాక్‌‌డౌన్‌ ను పొడ‌గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాలు, కూరగాయలు అంటూ పదేపదే బయటకు రావద్దని, ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపే అన్ని పనులు చేసుకుని ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వైర‌స్‌‌ను క‌ట్టడి చేయాలంటే ప్రజ‌లంతా స్వీయ నియంత్రణ పాటించాల‌ని, పోలీసుల విధుల‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. సైబ‌రాబాద్ ప‌రిధిలో మొత్తం 75 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామ‌ని, 5 వేల మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నామ‌ని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.



Next Story

Most Viewed