అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు: బిందు రాణి

by  |
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు: బిందు రాణి
X

దిశ, కీసర: అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నాగారం మున్సిపల్ టీం లీడర్ బిందు రాణి అన్నారు. నాగారం మున్సిపల్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులతో అక్రమ నిర్మాణాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు గుర్తించామన్నారు. ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. నిర్మాణదారులు తప్పనిసరిగా ఇంటి అనుమతులు టీఎస్ బీపాస్ ద్వారా పొందిన అనంతరం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అలా కాకుండా అడ్డ దారిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చి వేస్తామన్నారు.

రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్న ఎలాంటి భూములలో, అలాగే ప్రభుత్వ భూములలో నిర్మాణాలు జరుగుతున్నట్లు వాటిపై ఇటీవల కలెక్టర్, ఆర్డీఓ, మండల తహసీల్దార్ కు మున్సిపల్ కౌన్సిలర్లే ఫిర్యాదు చేశారన్నారు. క్షేత్ర స్థాయిలో వచ్చిన ఫిర్యాదులు అన్నిటిపై పరిశీలన చేసి వాటిని తొలగిస్తామని, తెలిపారు. అనుమతులకు విరుద్దంగా సెట్ బ్యాక్ తీసుకోకుండా, పెంట్ హౌస్‌లు, గ్రౌండ్ ప్లోర్‌లో నిర్మాణాలు చేస్తే వాటిని సైతం తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వాణి రెడ్డి, టీం సభ్యులు రాజు, ఫైర్ మెన్ కుమార స్వామి, ఆర్‌అండ్‌బి ఎఈ శ్రీనివాస్ రెడ్డి, టీపీఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story