ఏపీలో క్లస్టర్ల గందరగోళం

by  |
ఏపీలో క్లస్టర్ల గందరగోళం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాలు అందరికీ ఇంటివద్దకే చేర్చాలన్న లక్ష్యంతో ఈ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. వలంటీర్లను ఎంపిక చేసి వారికి 50 ఇళ్లను అప్పగించి ఆ పరిధిలోని పారిశుధ్యంతో పాటు పంచాయతీ పరిధిలోని పనుల పర్యవేక్షణ అప్పగించింది. ఈ క్రమంలో వలంటీర్లు తొలుత గ్రామంలోని ఇళ్లు వాటి యజమానులు, వారికి సంబంధించిన వివరాలన్నీ గణించారు. ఆ క్రమంలోనే వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వారి ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు కూడా ప్రభుత్వానికి నివేదించారు.

తాజాగా వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మ్యాపింగ్‌ పనిని అప్పగించింది. హౌస్ మ్యాపింగ్ అంటే ఒక ఇంట్లో ఎవరెవరుంటారు? వారికి అందుతున్న ప్రభుత్వం పథకాలు ఏవి? లబ్దిదారులెంతమంది? వంటి వివరాలు వేలిముద్రల సహితంగా నమోదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించింది. సమయం ముంచుకొస్తోంది. లబ్దిదారులకు ఎలా మ్యాపింగ్ చేయించుకోవాలో తెలియడం లేదు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వచ్చేనెల 1 నుంచి సక్రమంగా పెన్షన్లతోపాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

పెన్షన్‌ల పంపిణీకి క్లస్టర్‌ పరిధిలోని ప్రతీ కుటుంబం వేలిముద్ర వేసి మ్యాపింగ్‌ చేయించుకోవాలని వలంటీర్లు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల నుంచి ఈ ప్రక్రియ నత్తనడకగా సాగుతున్నది. వలంటీర్‌ తన పరిధిలో ఇళ్లకు వేలిముద్ర పరికరం తీసుకొని వచ్చి మ్యాపింగ్‌ చేయాలి. అయితే వలంటీర్లకు అందజేసిన ఫోన్లతో మ్యాపింగ్‌ సక్రమంగా జరగడంలేదు. సాంకేతిక అవాంతరాలతో ప్రతీ ఇంటి దగ్గర గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఫోన్‌ మొరాయిస్తుండటంతో వలంటీర్లు మ్యాపింగ్‌ సకాలంలో చేయలేకపోతున్నారు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తున్న కుటుంబాల్లో ఆందోళణ పెరిగిపోతోంది.

పేదరికం కారణంగా అందే ఆసరా తొలగించబడుతుందేమోనన్న భయం వారిలో నెలకొంది. ఇంకోవైపు జీవనోపాధి వెతుక్కుంటూ స్వస్థలాలను విడిచి వెళ్లిన దినసరి కూలీల్లో మరోకరకమైన ఆందోళన గూడుకట్టుకుంది. ఈ మ్యాపింగ్‌కు అందుబాటులో లేకపోతే.. తమకు రేషన్, పెన్షన్లు అందకుండాపోతాయేమోనని భయపడుతున్నారు. వీటన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని లబ్దిదారులు కోరుకుంటున్నారు.


Next Story

Most Viewed