జీవో.. మర్గయా?

by  |
జీవో.. మర్గయా?
X

దిశ, ఆదిలాబాద్: జీవో 3 ఉపసంహరణకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో వారు పోరుబాట పట్టారు. అలా జరగకపోతే ఇక భయంకర యుద్ధమే అంటూ ఇంకోవైపు శబ్దాల అలజడి. ఇలా సాగుతున్న పరిణామంతో చివరికి ఏమైతదోననేది అర్థంకావడంలేదు. అదేంటో ఓసారి చూద్దాం..

తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీఉద్యోగుల హక్కులకు సంబంధించిన జీవో 3 ఉపసంహరించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకుని అసలైన ఆదివాసులమైన తమకు 1/70 చట్టం ప్రకారం అన్ని హక్కులు దక్కలేదని, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను గిరిజనులు కలిసి విన్నపించారు. అయినా ఉలుకూపలుకూ లేదు. పైగా అసలుకే ఎసరు వస్తున్నట్లు సమాచారమందింది. దీంతో అలా జరిగితే తమ పోరును మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఒకవేళ వారికి అనుకూలంగా ప్రభుత్వం అడుగులు వేస్తే అడవిలో భయంకర వాతావరణం ఉంటుందని ఇంకోవర్గం అంటున్నట్లు సమాచారం.

అయితే.. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులకు అన్ని హక్కులు దక్కేలా కేంద్రం 1/70 చట్టం తీసుకొచ్చింది. అప్పట్నుంచి వారికి ఆ అడవులపై అన్నీ హక్కులు వారికే చెందుతున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లోకి క్రమంగా ఆదివాసేతర గిరిజనులు చొరబడి హక్కులు అనుభవిస్తున్నారు. దీనికితోడు మహారాష్ట్ర ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో వలస వచ్చిన లంబాడాలు ఏజెన్సీలో పాగా వేశారు. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ముస్లింలు కూడా భారీగానే ఏజెన్సీలోకి వచ్చి విస్తరించారు. ఇలా వీరందరూ ఆ హక్కులు అనుభవిస్తున్నారు.

అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా ఆదిమ గిరిజన ఉద్యోగుల కోసం జీవో 3 తీసుకువచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీతోపాటు వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో వివిధ తెగలకు చెందిన ఆదివాసీలు జీవిస్తున్నారు. భూమిపై హక్కు కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం ఉండగా ఆదివాసీ ఉద్యోగుల కోసం జీవో 3 కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ ఆదిమ గిరిజనేతర జాతులు అక్రమంగా భూములను అనుభవిస్తూ ఉండగా.. అదే తరహాలో ఆదిమ ఉద్యోగులకు కూడా వారి హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఆదిమ గిరిజన తెగలతో భర్తీ చేయాలన్న జీవో 3 క్రమంగా పలుచన అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ఆదిమ గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీ పత్రాలతో ఉద్యోగాలు అనుభవిస్తూ ఉండగా మళ్లీ కొత్త ఉద్యోగాలను కూడా ఆదిమ గిరిజనులకు దక్కకుండా కుట్ర జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 3 కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వలస లంబాడాలు, ఇతర జాతులను తొలగించాలని ఇప్పటికే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. మరోవైపు వలస లంబాడాలతోపాటు ఇతర గిరిజన జాతులు జీవో 3 రద్దు కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పోరాటం చేస్తున్నారు. తాజాగా జీవో 3 ప్రకారం ఏజెన్సీలో ఉన్న ఉద్యోగాలు ఆదిమ గిరిజనులతో భర్తీ చేయాలంటూ వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడంతోపాటు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ జీవోను బలంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆత్రం సక్కు జీవో 3 ను బతికించాలని కోరుతూ అసెంబ్లీలో విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే గిరిజన మంత్రి నుంచి గానీ, ముఖ్యమంత్రి నుంచి గానీ జీవో 3 పట్ల ఆదిమ గిరిజనులకు అనుకూలంగా ప్రభుత్వ స్పందన లేకపోవడం ఆదిమ గిరిజన ఉద్యోగులతోపాటు నిరుద్యోగ ఆదిమ గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నది.

ఇప్పటికే ఆదివాసీల వలసలు తీవ్రమైన పోరు జరుగుతున్న తరుణంలో జీవో 3 కఠినంగా అమలు చేసే విషయంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అగ్నికి ఆజ్యం పోయడం అవుతుందని ఆదిమ గిరిజన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జీవో 3 శాశ్వత అమలు కోసం త్వరలోనే మరో పోరాటానికి సమాయత్తం అవుతోందని రాష్ట్ర కన్వీనర్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఒకవేళ జీవో 3 ను శాశ్వత అమలు చేస్తే తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో మరో భయంకరమైన వాతావరణం నెలకొనడం ఖాయమన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Tags : adivasi, lambada, g.o.3, 1/70 act

Next Story

Most Viewed