హాస్టల్ వార్డెన్లపై బీసీ కమిషన్ సభ్యులు ఫైర్.. పిల్లలకు ఇదే పెడుతున్నారా అంటూ..

by  |
హాస్టల్ వార్డెన్లపై బీసీ కమిషన్ సభ్యులు ఫైర్.. పిల్లలకు ఇదే పెడుతున్నారా అంటూ..
X

దిశ,తుంగతుర్తి : ఏందీ..? ఈ కుళ్ళిన టమాటాలు, పిల్లలకు ఇవే వండి పెడుతున్నారా ? గ్యాస్ స్టవ్‌ను ఇలాగే భద్రపరుస్తారా ? పిల్లలు మీకు భోజనాలు సక్రమంగా పెడుతున్నారా? కూరలు రుచికరంగా ఉంటున్నాయా..? కోడి గుడ్లు వారంలో ఎన్ని సార్లు పెడుతున్నారు..? ఇలా వివిధ ప్రశ్నలను వసతి గృహ వార్డెన్, వర్కర్లు, విద్యార్థులపై రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ కురిపిస్తూ సమాధానాలను రాబట్టుకున్నాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పైగానే అందులో ఉండి వంటశాల, స్నానాల గదులు, నీటి కుళాయి, తదితర వాటిని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి..! నేను ఉన్నదే మీకోసం అని చెబుతూ సమస్యలపై కొంత మంది విద్యార్థులను లేపి ప్రశ్నించారు. వసతి గృహంలో ఏ సమస్య ఉన్నా సెల్ ఫోన్ కు బదులుగా నేరుగా తన కార్యాలయానికి ఉత్తరం రాయాలని పేర్కొంటూ కార్యాలయ అడ్రస్‌ని విద్యార్థులకు రాసిచ్చారు. అంతేకాకుండా లెటర్ క్రిందిభాగంలో “బీసీ విద్యార్థులు తుంగతుర్తి” అనే విధంగా రాస్తే తాను అన్ని విషయాలు గ్రహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు దేవుళ్ళతో సమానమని వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూడవలసిన బాధ్యత ఉందని వార్డెన్ అంజయ్యకు సూచించారు.

ప్రభుత్వం వారి చదువులకు ఎంతో ఖర్చు చేస్తున్న దృష్ట్యా వారి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలిపారు. నెలకు ఒకమారు స్థానిక ఎంపీపీ గుండగాని కవిత వసతి గృహాన్ని తనిఖీ చేసి లోటుపాట్లు గ్రహిస్తారని తెలిపారు. సాయంత్రం సమయంలో ట్యూషన్ టీచర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చలికాలంలో స్నానాలకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా వేడినీళ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కిషోర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి తన సొంత ఖర్చుతో విద్యార్థులందరికీ బకెట్లు, జగ్గులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సంగారెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ప్రిన్సిపాల్ కోతి రాములు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సైదులు, గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్, పార్టీ నాయకులు గుండగాని రాములు,కటకం వెంకటేశ్వర్లు,గునిగంటి సంతోష్, దొంగరి శ్రీనివాస్,తునికి స్థాయిలు, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed