ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు రాజమౌళి వార్నింగ్.. వాటిని మార్చుకోవాలని ట్వీట్

by  |
director rajamouli tweet
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్ గానే ఉంటాడు. తనకు నచ్చని అంశాలపై అప్పుడప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ఉంటాడు. తాజాగా జక్కన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రాజమౌళి ఎయిర్ పోర్ట్ లో చూసిన కొన్ని బాధాకర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో కనీస వసతులు కూడా లేవని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బుధవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను వివరిస్తూ ” అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను లుఫ్తాన్సా ఫ్లైట్ ద్వారా ఢిల్లీ చేరుకున్నాను. అక్కడికి చేరుకోగానే ఆర్టీపీసీఆర్ టెస్ట్స్ కోసం అవసరమైన కొన్ని ఫార్మ్స్ ఇచ్చి నింపమన్నారు. కానీ ఎక్కడ కూర్చొని నింపాలో అర్ధం కాలేదు. కొంతమంది పత్రాలను గోడకు పెట్టి, మరికొంతమంది కింద నేలమీద కూర్చోని నింపుతున్నారు. పరిస్థితి చూడడానికి ఏమీ బాగాలేదు. దీని కోసం టేబుల్స్ ఏర్పాటు చేయడం అనేది సింపుల్ సర్వీస్. ఇక ఎగ్జిట్ గేట్ దగ్గ‌ర ఆక‌లితో ఉన్న‌ వీధి కుక్క‌లు సర్ ప్రైజింగ్ గా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఇలా అయితే విదేశాలనుంచి వచ్చేవారికి మన దేశంపై ఎలాంటి గౌరవం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి. ధన్యవాదాలు” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవల్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఈ విషయం చెప్పడంతో నెటిజన్లు ఈ ట్వీట్ ని నెట్టింట వైరల్ గా మార్చేశారు. మరి రాజమోళి ట్వీట్ కైనా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ స్పందించి వాటిపై దృష్టి సారిస్తుందేమో చూడాలి.

Next Story