సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ గౌడ్ లేఖ.. ‘బీసీ బంధు’ ప్రకటించాలని డిమాండ్

by  |
dalitha bandhu telangana
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు ‘దళిత బంధు’ మాదిరిగానే ‘బీసీ బంధు’ను ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల అభ్యుణ్నతి కోసం వెంటనే బీసీ బంధును ప్రకటించాలంటూ ఆదివారం సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. హుజురాబాద్ వేధికగా ఆగస్టు 16న సీఎం కేసీఆర్ దళిత వర్గాల ఆర్థిక అభివృద్ధికి, స్వయం ఉపాధి కోసం వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో సమాజంలో సగ భాగానికి పైగా ఉన్న చేతి వృత్తులు, సంబండ వృత్తులు చేసుకుంటూ ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న బీసీ కులాల వారికి కూడా ‘బీసీ బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ బడ్జెట్‌లో రెండు, మూడు శాతం మాత్రమే నిధులు కేటాయించడంతో బీసీలకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధిచేకూరలేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ఎంబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించి అరకొరగానే ఖర్చు చేశారన్నారు. బీసీ, ఎంబీసీ, కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 92వేల మంది బీసీలు దరఖాస్తు చేసుకుని మూడేళ్లు గడుస్తున్నా రుణాలు మంజూరు చేయలేదన్నారు. అంతేకాకుండా 11 బీసీ కులాల ఫెడరేషన్లు ఉన్న వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా పాలక మండళ్లు నియమించకపోవడంతో అవి అచేతన స్థితిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 60 శాతం బీసీలున్నారని వారి ఓట్లు కావాలంటే ‘బీసీ బంధు’ను ప్రకటించి అర్హులైన బీసీలకు వంద శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ సభలోనే బీసీ బంధును ప్రకటించి బీసీల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునివ్వాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు.

Next Story

Most Viewed