శ్రీకాకుళంలో జిల్లాలో నాటు బాంబుల కలకలం

by  |
శ్రీకాకుళంలో జిల్లాలో నాటు బాంబుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు లభించడం కలకలం రేపుతుంది. అది కూడా మున్సిపల్ ఎన్నికల వేల లభించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఎన్నికలను అటు వైసీపీ ఇటు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఇతర సమస్యాత్మక గ్రామాల పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో నాటుసారా పంపిణీని అడ్డుకోవడంతోపాటు అల్లర్లు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు పలు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

కంచిలి మండలం గొల్ల కంచిలి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఓ ఇంట్లో నాటుబాంబులు గుర్తించారు. ఆ ఇంటి నుంచి 40 నాటు బాంబులు , రాళ్లు , గాజు సీసాలు , కర్రలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ శివరామిరెడ్డికి ఇతర పోలీసులు సమాచారం అందించగా ఆయన వచ్చి విచారణ చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణ కోసం బాంబులు సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దువ్వ లోకనాధం , డొక్కలి దాలయ్య మధ్య చాలా కాలంగా నడుస్తున్న రాజకీయ, ఆధిపత్య వైరం నేపథ్యంలో వారే ఈ బాంబులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో అనేక సార్లు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. 20 ఏళ్ల క్రితం నాడు బాంబులతో దాడి చేసుకున్నారని..తాజాగా మరోసారి దాడులు చేసుకునేందుకు బాంబులు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. సమస్యాత్మక గ్రామం అయిన గొల్ల కంచిలి పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి స్పష్టం చేశారు.



Next Story