టీ-20 సిరీస్ లంకేయులదే.. భారత్‌ ఘోర పరాజయం

by  |
టీ-20 సిరీస్ లంకేయులదే.. భారత్‌ ఘోర పరాజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలిచి టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 81 పరుగులను చేసింది. ఇక అత్యల్ప టార్గెట్‌ను శ్రీలంక 14.3 ఓవర్లలోనే చేధించింది.

భారత ఇన్నింగ్స్..

ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌తో శ్రీలంక బౌలర్లు చెలరేగిపోయారు. చివరి వరకు అదే స్పీడ్‌ను కొనసాగించారు. దీంతో భారత బ్యాట్స్‌మాన్‌లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రుతురాజ్ (14), దేవదత్ (9), సంజూ శాంసన్ (0), నితీష్ రానా (6) పరుగులకే చేతులెత్తేశారు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌ను పూర్తిగా కోల్పోయిన టీమిండియా స్కోర్ చేయడం కష్టతరమైంది. ఇదే సమయంలో క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ (16), కుల్దీప్ యాదవ్(23 నాటౌట్), రాహుల్ చాహర్(5), వరుణ్ చక్రవర్తి(0), చేతన్ సకారియా(5 నాటౌట్)‌ పరుగులు చేయగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. దీంతో 8 వికెట్ల నష్టానికి భారత్ 81 పరుగులకే పరిమితం అయింది.

శ్రీలంక ఇన్నింగ్స్..

82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (12), మినోద్ భానుక(18), సమరవిక్రమ (6) పరుగులు చేసి వెనుదిరిగారు. ఈ ముగ్గురు కూడా రాహుల్ చాహర్ బౌలింగ్‌లోనే వికెట్లను కోల్పోయారు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన ధనుంజయ డిసిల్వా(23 నాటౌట్), హసనరంగ(14 నాటౌట్‌గా) నిలబడి మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో 14.3 ఓవర్లలో 82 పరుగులు చేసి భారత్‌పై విజయం సాధించింది శ్రీలంక జట్టు. దీంతో 2-1 ఆధిక్యంతో టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.


Next Story