అడ్డికి పావుశేరు లెక్కన క్రికెట్ ప్రసార హక్కులు

by  |
అడ్డికి పావుశేరు లెక్కన క్రికెట్ ప్రసార హక్కులు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా క్రికెట్ ప్రసార హక్కులను పలు బోర్డులు అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకుంటున్నాయి. అసలు బ్రాడ్‌కాస్టరే లేకుండా పోయేబదులు ఎంతో కొంత మొత్తానికి ప్రసార హక్కులు అమ్ముకొని బయటపడుతున్నాయి. తాజాగా, ఈ లిస్టులో శ్రీలంక క్రికెట్ బోర్డు చేరింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ (ఎస్‌పీఎన్)/టెన్ స్పోర్ట్స్‌తో ఉన్న బ్రాడ్‌కాస్ట్ ఒప్పందం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. గత నాలుగు నెలలుగా శ్రీలంక క్రికెట్‌కు బ్రాడ్‌కాస్టరే లేకుండా పోయాడు. టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. మొదటి నుంచి ఎస్‌పీఎన్ తక్కువ ధర కోట్ చేస్తూ వచ్చింది. గతంలో 60మిలియన్ డాలర్లకు క్రికెట్ హక్కులు అమ్మగా, ప్రస్తుతం కేవలం 22.5 మిలియన్ డాలర్లకే ప్రసార హక్కులు అమ్మాల్సి వచ్చింది. సోనీ సంస్థే ఈ హక్కులు తీసుకుంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డుకు రావల్సిన ఆదాయంలో గణనీయంగా కోతపడింది. కాగా, ఈ హక్కులను పరిమిత కాలానికి మాత్రమే అమ్మారని, కరోనా సంక్షోభం అనంతరం తిరిగి మరోసారి బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీలంక క్రికెట్ ప్రసార హక్కులను కొనడానికి స్టార్ గ్రూప్, డిస్కవరీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

Next Story