ఏసీబీకి ఆధారాలు సమర్పించిన సినీనటి శ్రీసుధ

by  |
ఏసీబీకి ఆధారాలు సమర్పించిన సినీనటి శ్రీసుధ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: సినీనటి శ్రీసుధ ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ మురళీ కృష్ణపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి బుధవారం ఏసీబీ అధికారులను కలిసి ఆధారాలను అందజేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణకు ఆమెకు మధ్య జరిగిన సంభాషణ వివరాలను ఆడియో రూపంలో ఉన్న డిజిటిల్ ఫైళ్ళను అందజేశారు. మురళీకృష్ణ డబ్బు తీసుకున్నట్టు ధృవీకరించే కొన్ని ఫోటోలు, ఇతర ఆధారాలను కూడా ఏసీబీకి అందించారు. ప్రముఖ సినిమాటోగ్రఫీ చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో గతంలో శ్రీసుధ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేసిన రెండ్రోజులకే ఆయనకు బెయిల్ రావడంపై ఆశ్చర్యానికి గురయ్యి పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో సహకరిస్తానంటూ మురళీ కృష్ణ తన దగ్గర డబ్బులు తీసుకున్నారని, దీనికి తోడు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్‌ సృష్టించారని ఏసీబీ అధికారులకు ఇటీవల పోస్టు ద్వారా శ్రీసుధ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను బుధవారం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి వివరాలు అందించారు.


Next Story

Most Viewed