రాయలసీమ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందుకు రంగం సిద్ధం

by  |
ap-cm-jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ వాసుల కల నెరవేరబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్సార్ గ్రూపు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో బుధవారం ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి ఎస్సార్ గ్రూప్‌హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ చైర్మన్ జె మెహ్రాలు సీఎం జగన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు సన్నద్దత వ్యక్తం చేశారు. అలాగే కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంతో జగన్ వారిని అభినందించారు.

దీంతో ఈ ఏడాది నవంబర్‌లో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగనుందని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం జిల్లాలో ఏర్పాటు చేస్తోన్న వైఎస్సార్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం కేటాయించిన 3,148.68 ఎకరాలకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులిచ్చింది. జమ్మలమడుగు మండలం పెద్దనందులూరు, సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రూ.3.89 కోట్ల స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తోన్న స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed