క్రిమిసంహారక మందు చల్లడం హానికరం : డబ్ల్యూహెచ్‌వో

by  |
క్రిమిసంహారక మందు చల్లడం హానికరం : డబ్ల్యూహెచ్‌వో
X

కరోనా వైరస్‌ను అంతం చేసే చర్యల్లో భాగంగా మనతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు వీధుల్లో, పార్కుల్లో, జనసందోహం ఉన్న చోట్లలో పెద్దఎత్తున క్రిమిసంహారక మందులు స్ప్రే చేశారు. అయితే ఇలా చేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం రోజున తప్పు బట్టింది. ఇలా స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికింది. అంతేకాకుండా ఇలా స్ప్రే చేయడం వల్ల కరోనా వైరస్ చావడమేమోగానీ భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

నేల మీద ఉన్న మట్టిని, గాలిలో ఉన్న దుమ్ముని తగలగానే క్రిమిసంహారక మందులు తమ శక్తిని కోల్పోతాయే తప్ప దీని వల్ల వైరస్ చనిపోదని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అంతేకాకుండా పలు చోట్ల అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న క్రిములు ఈ క్రిమిసంహారక మందు తగిలి క్రియాశీలకంగా మారే అవకాశం కూడా ఉందని చెప్పింది. వీధుల్లోని సిమెంటు రోడ్లు, మట్టిరోడ్లు, ఫుట్‌పాత్‌లు కొవిడ్ 19 వైరస్‌కు ఆవాస స్థలాలని తామెక్కడా పేర్కొనలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అలాగే క్రిమిసంహారక మందులను పెద్ద మొత్తంలో స్ప్రే చేయడానికి మనుషులను ఉపయోగించడాన్ని సైతం డబ్ల్యూహెచ్‌వో తీవ్రంగా తప్పుబట్టింది. అలా చేయడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక కొన్ని దేశాల్లో ఏకంగా పాజిటివ్ అనుమానమున్న ప్రజల మీద క్లోరిన్ లాంటి వాయువును ఒకేసారి స్ప్రే చేయడం గురించి ప్రస్తావిస్తూ.. వారి అజ్ఞానానికి చింతిస్తున్నామని పేర్కొంది. కేవలం చేతులు శుభ్రంగా ఉంచుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మాత్రమే తాము సూచించాం తప్ప.. ఇలా చేయాలని ఎక్కడా చెప్పలేదని మరోసారి స్పష్టం చేసింది.

Next Story

Most Viewed