1st నుంచి వారికి స్పాట్ కొవిడ్ టీకాలు

by  |
covid vaccinations
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకాల పంపిణీ ముగింపు దశకు వస్తున్నందున మరో రెండు సెక్షన్ల ప్రజలకు మార్చి1 నుంచి ప్రారంభం కానుంది. 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ విధానంతో పేర్లు నమోదు చేసుకున్న వెంటనే టీకాలను ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు సెక్షన్ల ప్రజలు సుమారు యాభై లక్షల మంది ఉంటారని ప్రజారోగ్య శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి 16 లక్షల వ్యాక్సిన్ డోసులు చేరుకోగా కేవలం నాలుగు లక్షల డోసులు మాత్రమే వినియోగించినట్టు అధికారి వివరించారు. ఇకపై ‘స్పాట్ రిజిస్ట్రేషన్ కమ్ వ్యాక్సిన్’ విధానంలో టీకాలు ఇస్తారు. మార్చి1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి పేర్లను నమోదు చేసుకోవచ్చని, అదే రోజు టీకా వేసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ అధికారి వివరించారు. కేంద్రం నేడో రేపో మార్గదర్శకాలను జారీ చేస్తుందన్నారు.

ఏదేని గుర్తింపు కార్డు లేదా దీర్ఘకాలిక వ్యాధులున్నట్లు ధ్రువీకరించే పత్రాలను చూపించి వ్యాక్సిన్ పొందవచ్చని వివరించారు. రాష్ట్రంలోని సుమారు 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 140 సెకండరీ కేర్ ఆసుపత్రులు, టెరిటరీ కేర్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేర్లను నమోదు చేసుకుని టీకాలు తీసుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్ విధానం ద్వారా పేర్లను నమోదు చేసుకోడానికి ‘కొవిన్-2.0’ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురానుందని, తగిన ధ్రువీకరణ పత్రాలు లేదా గుర్తింపు కార్డుల వివరాలను పొందుపర్చి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం డోసులలో మూడు లక్షలు మాత్రమే భారత్ బయోటెక్ తయారుచేసిన ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్‌లని, మిగిలినవన్నీ కొవిషీల్డ్ బ్రాండ్ అని తెలిపారు. మార్చి 1 తర్వాత రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు టీకాలను పంపిణీ చేస్తామన్నారు.



Next Story

Most Viewed