లిక్కర్ రవాణా కేసు నిందితులకు రిమాండ్.. సిట్ రిపోర్టులో సంచలన విషయాలు

by Vemula.Srinu Prasad |

లిక్కర్ రవాణా టెండర్ల కేసులో అరెస్టయిన నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి, సునీల్‌లకు విజయవాడ ఏసీబీ కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది...

లిక్కర్ రవాణా కేసు నిందితులకు రిమాండ్.. సిట్ రిపోర్టులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ రవాణా టెండర్ల కేసులో అరెస్టయిన నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, సునీల్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు నిందితులకు కోర్టు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మద్యం రవాణా టెండర్ల ద్వారా దాదాపు రూ.192 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే, ముందస్తు ప్రణాళికతో టెండర్ల విధానాన్ని పూర్తిగా మార్చేశారని సిట్ అధికారులు గుర్తించారు.

సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ అనే నిర్దిష్ట సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే బినామీ కంపెనీలను రంగంలోకి దించినట్లు నివేదికలో వెల్లడించారు. రవాణా ఛార్జీలను కిలోమీటరుకు రూ.19.68 నుంచి ఏకంగా రూ.35కు పెంచారని, ఎలాంటి టెండర్లు లేకుండానే సిగ్మా సంస్థ గడువును నాలుగుసార్లు పొడిగించారని సిట్ స్పష్టం చేసింది. అప్పటి డిప్యూటీ సీఎం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా వీరు లెక్కచేయలేదని తెలిపింది. షెల్ కంపెనీల ద్వారా నిధులను భారీగా మళ్లించారని, ఇందులో భాగంగానే వాసుదేవరెడ్డి బావమరిదికి చెందిన ఓ మిల్క్ కంపెనీకి అక్రమ సొమ్ము బదిలీ అయినట్లు సిట్ పేర్కొంది. ఈ అక్రమాలకు సంబంధించి కీలకమైన డిజిటల్ సాక్ష్యాలను, కాల్ డేటా ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు విచారణ బృందం వెల్లడించింది.

Next Story