కేన్ విలియమ్సన్, నిస్సాంకలకు షాక్ ఇచ్చిన జైశ్వాల్

by Dishanational3 |
కేన్ విలియమ్సన్, నిస్సాంకలకు షాక్ ఇచ్చిన జైశ్వాల్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకుగానూ అతనికి ఈ అవార్డు దక్కింది. ఐసీసీ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. పోటీలో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక‌లను జైశ్వాల్ వెనక్కినెట్టి విజేతగా నిలిచాడు. గత నెలలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నేపథ్యంలో జైశ్వాల్‌‌‌ను ఈ అవార్డు వరించింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన తొలిసారే అవార్డు దక్కడం విశేషం. అలాగే, గతేడాది సెప్టెంబర్‌లో గిల్ ఈ అవార్డు అందుకోగా.. ఆ తర్వాత ఈ అవార్డు వరించింది జైశ్వాల్‌నే.

ఐసీసీ అవార్డు దక్కడంపై జైశ్వాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘భవిష్యత్తులో మరింత సాధిస్తా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ నాకు ఉత్తమైనది. ఇది నా తొలి ఐదు మ్యాచ్‌ల సిరీస్. ఈ సిరీస్‌లో నా ఆటను ఆస్వాదించాను. సహచరులతో అద్భుతమైన అనుభవం పొందాను.’ అని జైశ్వాల్ తెలిపాడు.

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో జైశ్వాల్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. టీమ్ ఇండియా సిరీస్‌ విజయం సాధించడంలో ఈ యువ ఓపెనర్ కీలక పాత్ర పోషించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు టెస్టుల్లో 712 పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి నెలలో ఆడిన మూడు టెస్టుల్లో 112 సగటుతో 560 పరుగులు చేశాడు. తొలి టెస్టులో టీమ్ ఇండియా పరాజయం తర్వాత జట్టు పుంజుకోవడంలో జైశ్వాల్‌ది ముఖ్య పాత్ర. వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే జోరును కొనసాగించిన టీమ్ ఇండియా రాంచీ, ధర్మశాల టెస్టులోనూ గెలిచి 4-1తో సిరీస్ సొంతం చేసుకుంది.



Next Story

Most Viewed