రెజ్లర్ల నిరసన.. కేంద్రమంత్రి ముందు 5 కీలక డిమాండ్లు

by Disha Web Desk 4 |
రెజ్లర్ల నిరసన.. కేంద్రమంత్రి ముందు 5 కీలక డిమాండ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేపట్టిన నిరసనలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది.

బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని, దాంతో పాటు రెజ్లింగ్‌ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలిని నియమించాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలకమండలి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. ఇక ఈ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు, నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం నాడు జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. కాగా, రెజ్లర్ల ఆందోళనలపై స్పందించిన కేంద్రప్రభుత్వం వారిని బుధవారం రెండోసారి చర్చలకు ఆహ్వానించింది. గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో తమకు ఆశించిన ఫలితం దక్కలేదని బజ్‌రంగ్ పునియా తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నివాసంలో సాక్షిమాలిక్, బజరంగ్ పునియా చర్చల్లో పాల్గొన్నారు.

Next Story

Most Viewed