వరల్డ్ గేమ్స్‌లో బోణీ కొట్టిన భారత్.. ఆర్చర్ రిషబ్‌కు కాంస్యం

by Harish |

చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది.

వరల్డ్ గేమ్స్‌లో బోణీ కొట్టిన భారత్.. ఆర్చర్ రిషబ్‌కు కాంస్యం
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. ఆర్చర్ రిషబ్ యాదవ్ దేశానికి తొలి మెడల్ అందించాడు. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచాడు. బ్రాంజ్ మెడల్ కోసం రిషబ్‌తోపాటు మరో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ పోటీపడ్డాడు. శనివారం జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో రిషబ్ 149-147 తేడాతో అభిషేక్‌ను ఓడించాడు. ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. మొదటి సెట్‌ను రిషబ్ 30-29తో నెగ్గగా.. రెండు, మూడు సెట్లలో 29-29, 30-30తో ఇద్దరు సమంగా పాయింట్లు సాధించారు. ఇక, ఆఖరిదైన నాలుగో సెట్‌లో గెలుపు రిషబ్‌దే. 30-29తో నెగ్గిన అతను 2 పాయింట్లతో తేడాతో విజయం సాధించి బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. ఫైనల్‌లో నెగ్గిన నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ స్లోషెర్ బంగారు పతకం గెలవగా.. అమెరికా ఆర్చర్ కర్టిస్ బ్రాడ్‌నాక్స్ రజతం సాధించాడు. వరల్డ్ గేమ్స్‌లో వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో పతకం సాధించిన తొలి భారత ఆటగాడు రిషబ్. మొత్తంగా ఆర్చరీలో రెండో మెడల్. మూడేళ్ల క్రితం జరిగిన గత ఎడిషన్‌లో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించారు. ఈ సారి 17 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం వరల్డ్ గేమ్స్‌లో పాల్గొంది. ఆర్చరీతోపాటు బిలియరడ్స్, రాకెట్ బాల్, రోలర్ స్పోర్ట్స్, వుషు క్రీడల్లో భారత అథ్లెట్లు బరిలోకి దిగారు.

Next Story