వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత స్కేటర్ ఆనంద్ కుమార్

by Harish |

చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత స్కేటర్ ఆనంద్‌ కుమార్ వెల్కుమార్ చరిత్ర సృష్టించాడు.

వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత స్కేటర్ ఆనంద్ కుమార్
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న వరల్డ్ గేమ్స్‌లో భారత స్కేటర్ ఆనంద్‌ కుమార్ వెల్కుమార్ చరిత్ర సృష్టించాడు. టోర్నీ చరిత్రలో తొలిసారి రోలర్ స్పోర్ట్స్‌లో దేశానికి తొలి మెడల్ అందించాడు. 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ ట్రాక్ స్ప్రింట్ ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గాడు. శుక్రవారం జరిగిన ఈవెంట్‌లో ఆనంద్ కుమార్ ముందుగా ప్రిలిమినరీ రౌండర్‌లో హీట్‌-2 గ్రూపులో మూడో స్థానంలో నిలిచి సెమీస్‌‌కు అర్హత సాధించాడు. సెమీస్‌లో రెండో స్థానంలో నిలవడంలో ఫైనల్ బెర్త్ దక్కింది. ఇక, పతక రౌండ్‌లో అతను 1:22.846 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. దీంతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన సెబాస్టియన్(1:22:288) స్వర్ణం గెలుచుకోగా.. కొలంబియా అథ్లెట్ జాన్ ఎడ్వర్ టాస్కన్(1:21.846) రేసును ముందుగానే ముగించినా పెనాల్టీ కారణంగా రజతంతో సరిపెట్టాడు.అంతర్జాతీయ వేదికపై ఆనంద్ కుమార్ సత్తాచాటడం ఇదే మొదటిసారి కాదు. 2021లో పురుషుల జూనియర్ 15,000 మీటర్ల ఎలిమినేషన్ రేసులో రజతం సాధించిన అతను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. అలాగే, ఆసియా గేమ్స్-2023లో పురుషుల 3,000 మీటర్ల ఈవెంట్‌లో కాంస్యం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ఈ వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం. ఆర్చర్ రిషబ్ యాదవ్ కాంస్యం సాధించగా.. వుషు అథ్లెట్ నమ్రత బాత్రా సిల్వర్ మెడల్ దక్కించుకుంది.


Next Story