మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు.. బెంగళూరులో జరిగే మ్యాచ్‌లు అక్కడికి షిఫ్ట్

by Harish |

త్వరలో ప్రారంభం కానున్న మహిళల వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

మహిళల ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు.. బెంగళూరులో జరిగే మ్యాచ్‌లు అక్కడికి షిఫ్ట్
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో ప్రారంభం కానున్న మహిళల వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రివైజ్డ్ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. వేదికగా బెంగళూరు స్థానంలో నవీ ముంబైని ఎంపిక చేసింది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి తరలించింది. దీంతో పలు మ్యాచ్‌ల వేదికలు చేంజ్ అయ్యాయి. ఈ ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఎంపికైన నాలుగు వేదికల్లో బెంగళూరు ఒకటి. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో భాగంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం నియమించిన కమిషన్ ఎం.చిన్నస్వామి స్టేడియం పెద్ద మ్యాచ్‌లకు సురక్షితం కాదని నివేదిక అందజేసింది. ఈ క్రమంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బెంగళూరులో మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి సాధించలేకపోయింది. దీంతో బెంగళూరు స్థానంలో ఐసీసీ నవీ ముంబైని వేదికగా ఎంచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

వేదికలు మారిన మ్యాచ్‌లు ఇవే

సెప్టెంబర్ 30న భారత్, శ్రీలంక జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరగాల్సి ఉండగా ఆ మ్యాచ్ ఇప్పుడు గువహతిలో జరగనుంది. అక్టోబర్ 3న జరిగే ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌ను కూడా గువహతికి తరలించారు. దీంతో అక్టోబర్ 20న శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్‌తోపాటు అక్టోబర్ 23న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ నవీ ముంబైకి తరలించారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా అక్టోబర్ 26న నవీ ముంబైలో జరగనుంది. అలాగే, అక్టోబర్ 30న రెండో సెమీస్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. మరోవైపు, వైజాగ్‌లో అక్టోబర్ 10న జరగాల్సిన న్యూజిలాండ్, బంగ్లా మ్యాచ్‌కు ఇప్పుడు గువహతి వేదిక అవ్వగా.. గువహతి వేదికగా అక్టోబర్ 26న జరిగే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌ను వైజాగ్‌కు షిఫ్ట్ చేశారు.


Next Story