మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

by Harish |

వచ్చే ఏడాది జరగబోయే మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది.

మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది భారత్, పాకిస్తాన్ జట్లు ఎదురుపడనున్నాయి. ఈ దాయాదుల పోరుకు మహిళల టీ20 ప్రపంచకప్‌ వేదికకానుంది. మహిళల టీ20 వరల్డ్ కప్‌-2026కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది జూన్ 12 నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఎడ్జ్‌బస్టన్ వేదికగా జూన్ 14న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్‌లో భారత్‌కు కఠిన డ్రానే ఎదురైంది. టీమిండియా ఉన్న గ్రూపులో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్నాయి. వాటితోపాటు రెండు క్వాలిఫయింగ్ టీమ్స్ ఉంటాయి. జూన్ 14న పాక్‌తో పోరుతో భారత జట్టు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఆ తర్వాత జూన్ 17న క్వాలిఫయింగ్ టీమ్‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న మరో క్వాలిఫయింగ్ జట్టుతో, చివరి గ్రూపు మ్యాచ్‌లో జూన్ 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ గ్రూపులో భారత్ టాప్-2లో నిలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది.

అత్యధికంగా 12 జట్లు

గత ప్రపంచకప్‌లతో పోలిస్తే ఈ వరల్డ్‌కప్‌లో అత్యధికంగా 12 జట్లు పాల్గొనబోతున్నాయి. 12 జట్లును రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏలో భారత్ సహా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూపు బిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లను చేర్చారు. ఈ రెండు గ్రూపుల్లో రెండేసి చొప్పున క్వాలిఫయింగ్ జట్లు చేరుతాయి. అంటే ఒక గ్రూపులో మొత్తం 6 జట్లు పోటీపడతాయి. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. జూన్ 30, జూలై 2 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు, జూలై 5న ఫైనల్ జరగనుంది. 24 రోజులపాటు సాగే ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.


Next Story