ప్లేయర్ టూ ఓనర్.. ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా ఎవరో తెలుసా?

by Harish |

ప్లేయర్ టూ ఓనర్.. ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా ఎవరో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆర్యమాన్ బిర్లా.. బిజినెస్ వర్గాల్లో సుపరిచితమే అయినా క్రికెట్ వర్గాల్లో మాత్రం నిన్న మొన్నటి వరకు పెద్దగా తెలియని పేరు. ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తనయుడే ఈ ఆర్యమాన్ బిర్లా. ఇప్పుడు అతని పేరు క్రికెట్ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీకి కొత్త ఓనర్ అతనే. ఎందుకీ చర్చ అనుకుంటున్నారా.. ఈ యువ బిజినెస్‌మ్యాన్ ఆరేళ్ల క్రితం ఓ క్రికెటర్ కావడమే. 2019‌లో కొన్ని కారణాల వల్ల క్రికెట్‌ను వదిలేసిన అతను ఫ్యామిలీ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యం చేతులు మారిన విషయం తెలిసిందే. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృసంస్థ అయిన డియాజియో నుంచి ‌ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూపు, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి. రూ.16,706 కోట్లకు ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి. ఆర్సీబీ మహిళల జట్టు కూడా వారి సొంతమే. దీంతో ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా ఆర్యమాన్ బిర్లా నియమితులయ్యాడు. ప్రస్తుతం ఆర్యమాన్ వయసు 28 ఏళ్లు. 22 ఏళ్ల వరకూ క్రికెట్ ఆడాడు. మధ్యప్రదేశ్ తరపున దేశవాళీలో ప్రాతినిధ్యం వహించాడు.

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌లతో కలిసి డ్రెస్సింగ్ రూం కూడా పంచుకున్నాడు. ఆర్యమాన్ మధ్యప్రదేశ్ తరపున 9 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 414 రన్స్ చేశాడు. నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2018 రంజీ ట్రోఫీలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. అదే ఏడాది ఐపీఎల్‌ వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2019‌లో ఆర్యమాన్ బిర్లా మానసిక ఆందోళన కారణంగా కాంపిటేటివ్ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత తన తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆర్సీబీని కొనుగోలు చేయడంపై ఆర్యమాన్ బిర్లా స్పందిస్తూ..‘ఆర్సీబీ ప్రగతి కోసం ఈ భాగస్వామ్యంలో కలిసి రావడం ఒక గౌరం. ఇది క్రీడలు, మీడియా, వ్యాపారాలపై లోతైన అవగాహనను ఒక్క చోట చేర్చుతుంది.’అని ఆర్యమాన్ బిర్లా తెలిపాడు.


Next Story