కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ.. కారణం ఏంటంటే?

by Dishanational3 |
కోహ్లీ ఫ్యాన్స్‌కు నిరాశ.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు ఏడాది తర్వాత టీ20ల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు విరాట్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, టీ20ల్లో కోహ్లీ బ్యాటింగ్ చూడాలంటే అభిమానులు రెండో టీ20 వరకు ఆగాల్సిందే. నేడు అఫ్గాన్‌తో జరిగే తొలి టీ20కి అతను అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో విరాట్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని వెల్లడించాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు అతను జట్టుతో కలుస్తాడని చెప్పాడు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా మూడో టీ20 జరగనుంది. విరాట్‌తోపాటు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దాదాపు ఏడాది తర్వాత టీ20 మ్యాచ్‌లు ఆడబోతున్నారు. చివరిసారిగా వీరిద్దరూ 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన సెమీస్ ఆడారు. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లీ మరో మ్యాచ్ ఆడలేదు. యువకులకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దిగ్గజ క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తిరిగి పొట్టి ఫార్మాట్ ఆడాలన్న డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌కు ముందు అఫ్గాన్‌తో ఆడుతున్న చివరి టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed