‘ఉత్తమ క్రికెటర్’ రేసులో కోహ్లీ, జడేజా

by Dishanational5 |
‘ఉత్తమ క్రికెటర్’ రేసులో కోహ్లీ, జడేజా
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ‘ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023’ అవార్డు రేసులో నిలిచారు. ఈ అవార్డు నామినీలను ఐసీసీ శుక్రవారం రివీల్ చేసింది. కోహ్లీ, జడేజాతోపాటు ఆస్ట్రేలియా నుంచి పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అవార్డు కోసం పోటీపడుతున్నారు. గిల్, షమీతోపాటు కోహ్లీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. 2022లో తిరిగి ఫామ్ అందుకున్న విరాట్ గతేడాది కూడా జోరు కొనసాగించాడు. టీ20లకు దూరంగా ఉన్న అతను వన్డే, టెస్టులను కలుపుకుని 35 మ్యాచ్‌ల్లో 2,048 పరుగులు చేశాడు. 2017, 2018ల్లో వరుసగా రెండు సార్లు కోహ్లీ ఉత్తమ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ సారి కూడా అవార్డు దక్కితే కోహ్లీ.. అత్యధిక సార్లు ఉత్తమ క్రికెటర్‌గా నిలిచిన క్రికెటర్‌గా కొత్త చరిత్ర లిఖిస్తాడు. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తొలిసారిగా ఉత్తమ క్రికెటర్ అవార్డుకు పోటీపడుతున్నాడు. గతేడాది 35 మ్యాచ్‌ల్లో 613 పరుగులు చేయడంతోపాటు 66 వికెట్లు తీసుకున్నాడు. 2022 ఆసియా కప్‌లో గాయపడిన జడేజా గతేడాది ప్రారంభంలో ఆటకు దూరమైనా తిరిగి వచ్చిన తర్వాత సత్తాచాటాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కకర్ ట్రోఫీలో 22 వికెట్లు తీసి భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో 16 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు, భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ‘ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023’కు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు రేసులో నిలవడం అశ్విన్‌కు ఇది మూడోసారి. 2016లో ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా నిలువగా.. 2021లో కూడా నామినేట్ అయ్యాడు. గతేడాది అశ్విన్ 7 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌తోపాటు ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా), జోరూట్(ఇంగ్లాండ్) అవార్డు రేసులో ఉన్నారు.



Next Story