సహచర ఆటగాడు కన్నుమూత.. విరాట్ కోహ్లీ భావోద్వేగం

by Gantepaka Srikanth |

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన మాజీ సహచర ఆటగాడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సహచర ఆటగాడు కన్నుమూత.. విరాట్ కోహ్లీ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన మాజీ సహచర ఆటగాడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత బుధవారం ఛండీగఢ్‌లో అమన్‌ప్రీత్ (36) తుదిశ్వాస విడిచారు. 2007లో భారత అండర్-19 జట్టులో కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న అమన్‌ప్రీత్ మృతి క్రికెట్ వర్గాల్లో విషాదాన్ని నింపింది. అమన్‌ప్రీత్ మరణవార్త విన్న కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "అమన్‌ప్రీత్ గిల్ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి" అని పోస్ట్ చేశారు.

అమన్‌ప్రీత్ సింగ్ గిల్ కెరీర్..

2007లో శ్రీలంకలో జరిగిన త్రిముఖ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి వారితో కలిసి అమన్‌ప్రీత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ తరపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశారు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తూ యువ క్రికెటర్ల ఎదుగుదలకు కృషి చేశారు.

నివాళులర్పించిన క్రికెట్ దిగ్గజాలు..

అమన్‌ప్రీత్ మృతిపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన పంజాబ్ క్రికెట్‌కు చేసిన సేవలను కొనియాడింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ కూడా అమన్‌ప్రీత్‌తో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. "అమన్‌ప్రీత్ చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు.. కష్టపడి పనిచేసే క్రికెటర్" అని యువరాజ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. అమన్‌ప్రీత్ మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. ఒక ప్రతిభావంతుడైన ఆటగాడిని చిన్న వయసులోనే కోల్పోవడం పట్ల క్రీడా లోకం విచారాన్ని వ్యక్తం చేస్తోంది.

Next Story