సెమీస్‌లో ‘విదర్భ’దే విజయం.. ఫైనల్‌లో ముంబైతో పోరు

by Dishanational5 |
సెమీస్‌లో ‘విదర్భ’దే విజయం.. ఫైనల్‌లో ముంబైతో పోరు
X

దిశ, స్పోర్ట్స్: ఉత్కంఠభరితంగా సాగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో విదర్భ జట్టు 62 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌కు చేరుకోవడం విదర్భకు ఇది మూడోసారి కావడం విశేషం. సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను ఓడించిన విదర్భ జట్టు.. ఫైనల్‌లో ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, శనివారం మొదలైన సెమీస్‌లో టాస్‌ గెలిచిన విదర్భ.. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్‌ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన మధ్యప్రదేశ్.. 252 పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి అద్భుత శతకం(126)తో ఆకట్టుకున్నాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్‌ రాథోడ్‌ భారీ సెంచరీ (141) సాధించగా, అక్షయ్‌ వాడ్కర్‌(77), అమన్ మఖాడే(59) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో విదర్భకు 320 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక, 321 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ నాలుగో రోజైన బుధవారం ఆట ముగిసేసరికి 258 పరుగులకే ఆలౌట్ అయింది. యశ్ దూబే(94), హర్ష్ గాలీ(67) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. విదర్భ బౌలర్లలో అక్షయ్ వాఖరే, యశ్ థాకూర్ మూడేసి వికెట్లు తీయగా, ఆదిత్య సర్వతే, ఆదిత్య థాక్రే రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫలితంగా విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. వాంఖడే వేదికగా ఈ నెల 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.




Next Story

Most Viewed