ఇషా సింగ్‌‌ గురి అదిరింది.. స్వర్ణ పతకాలు కైవసం

by Dishanational5 |
ఇషా సింగ్‌‌ గురి అదిరింది.. స్వర్ణ పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఏసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలతో మెరిసింది. అంతేకాకుండా, ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. సోమవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఇషా విజేతగా నిలిచింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 6వ స్థానంలో నిలిచిన ఇషా ఫైనల్‌లో 243.1 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ 214.5 స్కోరుతో కాంస్యం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్‌, రిథమ్ సాంగ్వాన్, సుర్బి రావులతో కూడిన భారత జట్టు 1,736 స్కోరుతో గోల్డ్ మెడల్ సాధించింది.కాగా, గతేడాది ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ ఒక స్వర్ణంతోసహా నాలుగు పతకాలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అలాగే, గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు, ఏసియన్ క్వాలిఫయర్స్‌లోభారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్ కూడా ఖరారైంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ కేటగిరీలో వరుణ్ తోమర్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ ఈవెంట్‌లో 239.6 స్కోరుతో అతను బంగారు పతకం దక్కించుకున్నాడు. మరో భారత షూటర్ చీమా అర్జున్ సింగ్ 237.3 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. టీమ్ ఈవెంట్‌లో వరుణ్ తోమర్, అర్జున్ సింగ్, మాలిక్ ఉజ్వాల్‌లతో కూడిన భారత త్రయం 1,740 స్కోరుతో విజేతగా నిలిచింది.





Next Story

Most Viewed