అరటిపండ్ల కోసం రూ.35 లక్షలు ఖర్చు.. బీసీసీఐకి నోటీసు ఇచ్చిన ఉత్తరాఖండ్ హైకోర్టు

by Harish |

ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఉత్తరాఖండ్ హైకోర్టులో పలు పిటిషన్లు నమోదయ్యాయి.

అరటిపండ్ల కోసం రూ.35 లక్షలు ఖర్చు.. బీసీసీఐకి నోటీసు ఇచ్చిన ఉత్తరాఖండ్ హైకోర్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధులు దుర్వినియోగం జరిగినట్టు ఉత్తరాఖండ్ హైకోర్టులో పలు పిటిషన్లు నమోదయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్(సీఏయూ) 2024-25కు సంబంధించిన ఆడిట్‌ రిపోర్టు ఆధారంగా డెహ్రాడూన్‌కు చెందిన సంజయ్ రావత్‌తోపాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటషన్లపై జస్టిస్ మనోజ్ కుమార్ తివారి విచారణ చేపట్టారు. దాదాపు రూ.12 కోట్లు దుర్వినియోగం అయినట్టు పిటిషనర్లు పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఇచ్చే అరటిపండ్ల కోసం రూ. 35 లక్షలు వెచ్చించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అడిట్ నివేదిక ప్రకారం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఫీజు కింద రూ.6.4 కోట్లు, టోర్నమెంట్‌లు, ట్రయల్ మ్యాచ్‌లకు రూ.26.3 కోట్లు అసోసియేషన్ వెచ్చించింది. గతేడాది రూ.22.3 కోట్లు ఖర్చు చేసింది. ఇంత మొత్తం ఖర్చు చేసినా ఆటగాళ్లకు సౌకర్యాలు అందలేదని పిటిషన్లర్లు తెలిపారు. ఆహారం, ఆటగాళ్ల ఖర్చుల పేరుతో సీఏయూ కోట్లాది రూపాయలు స్వాహా చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ హైకోర్టు బీసీసీఐకి నోటీస్ పంపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


Next Story