క్రికెటర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం

by Naga Rani Yarlagadda |

భారత క్రికెట్ ప్లేయర్ రింకూ సింగ్ కు యూపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగమిచ్చింది. రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా నియమించాలని సర్కార్ నిర్ణయించింది.

క్రికెటర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టు స్టార్ ఫినిషర్ రింకూ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌరవించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆయన కనబరుస్తున్న అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా, రింకూను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO) గా నియమించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో రింకూ కీలక సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

వ్యక్తిగత విషాదంలోనూ అద్భుత పోరాటం

వరల్డ్ కప్ టోర్నీ సమయంలో రింకూ సింగ్ తీవ్ర వ్యక్తిగత వేదనను అనుభవించారు. ఆయన తండ్రి స్టేజ్-4 క్యాన్సర్‌తో గ్రేటర్ నోయిడాలో చికిత్స పొందుతూ మరణించారు. అటు తండ్రి ఆరోగ్యం, ఇటు దేశం కోసం ఆడాల్సిన బాధ్యత మధ్య రింకూ నిరంతరం ప్రయాణిస్తూనే జట్టు కోసం తన నిబద్ధతను చాటుకున్నారు. ఈ అంకితభావానికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించనుంది.

మరికొంతమంది క్రీడాకారులకు డీఎస్పీ పదవులు

రింకూ సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.

రాజ్‌కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రాజ్‌కుమార్ పాల్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా నియమించనున్నారు.

ప్రవీణ్ కుమార్ (పారాలింపిక్స్): పారాలింపిక్ హైజంప్‌లో స్వర్ణ పతకం సాధించిన ప్రవీణ్ కుమార్‌కు కూడా DSP పదవి దక్కింది.

అజిత్ సింగ్ (పారాలింపిక్స్): జావలిన్ త్రోలో రజత పతక విజేత అజిత్ సింగ్‌ను డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ ఆఫీసర్ (DPRO) గా నియమించనున్నారు.

సిమ్రాన్ (పారాలింపిక్స్): 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన సిమ్రాన్‌కు కూడా DPRO పదవిని కేటాయించారు.

ప్రీతిపాల్ (పారాలింపిక్స్): 100 మీ., 200 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు గెలిచిన ప్రీతిపాల్‌ను బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) గా నియమించారు.

Next Story