టైటిల్ డిఫెండ్ చేసుకున్న ట్రీసా-గాయత్రి.. శ్రీకాంత్‌కు తప్పని నిరాశ!

by Phanindra |

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో ట్రీసా-గాయత్రి జోడీ టైటిల్ డిఫెండ్ చేసుకున్నారు. కిడాంబి శ్రీకాంత్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.

టైటిల్ డిఫెండ్ చేసుకున్న ట్రీసా-గాయత్రి.. శ్రీకాంత్‌కు తప్పని నిరాశ!
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌కు చెందిన షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌ ఫైనల్‌లో అదరగొట్టిన ఈ జోడీ.. తమ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుంది. జపాన్‌కు చెందిన కాహో ఒసావా, మాయ్ తనాబేతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 17-21తో భారత జోడీ కోల్పోయింది. అయితే ఆ తర్వాత అద్భుతమైన ఎటాకింగ్ గేమ్‌తో పుంజుకుంది. చివరకు 21-13, 21-15తో వరుసగా రెండు గేమ్స్ తమ ఖాతాలో వేసుకొని టైటిల్ కాపాడుకుంది. ఈ మ్యాచ్ మొత్తం గంటా 16 నిమిషాలసేపు ఉత్కంఠభరితంగా సాగింది. తాము సుదీర్ఘ మ్యాచ్‌కు సిద్ధమయ్యే వచ్చామని, కనీసం గంటపైనే మ్యాచ్ సాగుతుందని అనుకున్నామని గాయత్రి ఈ సందర్భంగా తెలిపింది.

శ్రీకాంత్‌కు నిరాశ

ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశ తప్పలేదు. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చిన అతను.. 8 ఏళ్ల తర్వాత టైటిల్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన ప్రపంచ 59వ ర్యాంకు ప్లేయర్ జేసన్ గునావన్ చేతిలో శ్రీకాంత్‌ ఓటమి చవిచూశాడు. మొత్తం 67 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచులో తొలి గేమ్‌ను 16-21తో కోల్పోయిన శ్రీకాంత్.. ఆ తర్వాత పుంజుకొని 21-8తో రెండో గేమ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన చివరి గేమ్‌లో 20-22తో ఓడిపోయి, రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

Next Story