వచ్చే నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. సౌత్ జోన్ కెప్టెన్‌గా తిలక్

by Harish |

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టును నడిపించనున్నాడు.

వచ్చే నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ.. సౌత్ జోన్ కెప్టెన్‌గా తిలక్
X

దిశ, స్పోర్ట్స్ : ఆగస్టు చివర్లో ప్రారంభమయ్యే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టును నడిపించనున్నాడు. సెలెక్టర్లు 16 మందితో కూడిన సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్‌ను కెప్టెన్‌గా నియమించగా.. కేరళ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్‌ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం తిలక్ ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతున్న అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. హైదరాబాద్ జట్టు నుంచి తిలక్‌తోపాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్‌లకు జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర జట్టు నుంచి త్రిపుర్ణ విజయ్, రికీ భుయ్ స్థానం సంపాదించారు. షేక్ రషీద్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. దేవదత్ పడిక్కల్, విజయ్ కుమార వైశాఖ్(కర్ణాటక), నారాయణ జగదీసన్, సాయి కిశోర్(తమిళనాడు) వంటి కీలక ప్లేయర్లు సౌత్ జోన్‌కు ఆడనున్నారు. కాగా, దులీప్ ట్రోఫీని తిరిగి జోనల్ విధానంలోనే నిర్వహించబోతున్నారు. టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. వచ్చే నెల 28 నుంచి క్వార్టర్ ఫైనల్స్‌తో టోర్నీ ఆరంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్ 1లో నార్త్, ఈస్ట్ జోన్‌లు పోటీపడగా.. అందులో గెలిచిన జట్టుతో సౌత్ జోన్ సెమీస్‌ ఆడుతుంది.


Next Story