తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి

by Dishanational5 |
తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఆట తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా ఆ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. నోయిడా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టాన్స్ చేతిలో 54-18 తేడాతో చిత్తుగా ఓడింది. హర్యానా స్టీలర్స్‌పై ఏకైక విజయం తర్వాత టైటాన్స్‌కు వరుసగా ఇది మూడో పరాజయం. టోర్నీలో మొత్తంగా 8వ ఓటమి. మ్యాచ్ విజయానికొస్తే.. పుణేరి పల్టాన్స్‌కు టైటాన్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థి ఆటగాళ్లు వరుసగా పాయింట్లతో చెలరేగుతుంటే తెలుగు టైటాన్స్ ప్లేయర్లు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఫస్టాఫ్‌లో 23-10తో వెనుకబడిన టైటాన్స్ జట్టు.. సెకండాఫ్‌లో మరో 8 పాయింట్లు మాత్రమే జోడించగలిగింది. సందీప్ ధుల్ 5 పాయింట్లతో పర్వాలేదనిపించగా.. కెప్టెన్ పవన్ 2 పాయింట్లతో నిరాశపరిచాడు. అజిత్, రాబిన్ చౌదరి, హమిద్ సైతం విఫలమయ్యారు. మరోవైపు, మోహిత్ గోయత్(13 పాయింట్లు), అస్లామ్ ముస్తఫా (8 పాయింట్లు) పుణేరి పల్టాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పుణేరి పల్టాన్స్ పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ జెయింట్స్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 41-48 తేడాతో పాట్నా పైరేట్స్ విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో రైడర్ సచిన్ 15 పాయింట్లతో పాట్నా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. యూపీ కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 21 పాయింట్లతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.




Next Story

Most Viewed