లార్డ్స్‌లో అందుకే గొడవపడ్డా.. నాలుగో టెస్టుకు ముందు గిల్

by Phanindra |

నాలుగో టెస్టులో పంత్ ఆడుతున్నాడని గిల్ వెల్లడించాడు. అలాగే లార్డ్స్‌లో తను ఎందుకు గొడవపడిందీ వివరించాడు.

లార్డ్స్‌లో అందుకే గొడవపడ్డా.. నాలుగో టెస్టుకు ముందు గిల్
X

దిశ, స్పోర్ట్స్: నాలుగో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆడతాడని, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టంచేశాడు. లార్డ్స్ టెస్టులో గాయపడిన పంత్ కీపింగ్ చేయని సంగతి తెలిసిందే. ఇప్పుడు పంత్ కోలుకున్నాడని గిల్ చెప్పాడు. అలాగే గజ్జల్లో గాయంతో బాధపడుతున్న పేసర్ ఆకాష్ దీప్‌తోపాటు అర్షదీప్ కూడా ఈ టెస్టుకు అందుబాటులో లేడని కెప్టెన్ వెల్లడించాడు. నితీశ్ కుమార్ ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమైనట్లు తెలిపాడు. ఈ క్రమంలో అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశాలపై మాట్లాడుతూ.. కాంబోజ్ ఎలాంటి ఆటగాడో తమకు తెలుసునని, అతను ఈ మ్యాచులో అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని గిల్ చెప్పాడు. ప్రసిద్ధ్ లేదా కాంబోజ్ ఇద్దరిలో ఒకరిని తీసుకుంటామని అన్నాడు. ఇక పేలవ ప్రదర్శన చేస్తున్న కరుణ్ నాయర్ ఆటలో తమకేం లోపాలు కనిపించడం లేదని, ఒకసారి కుదురుకుంటే తను రాణిస్తాడని గిల్ చెప్పాడు. దీంతో నాయర్‌కు మాంచెస్టర్‌లో మరో అవకాశం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందుకే కోపం

లార్డ్స్ టెస్టులో మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్‌తో వాగ్వాదానికి దిగిన ఘటనపై కూడా గిల్ స్పందించాడు. ‘ఆ రోజు 7 నిమిషాల ఆట మిగిలి ఉంది. అలాంటి టైంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆడేందుకు 90 సెకన్లు ఆలస్యంగా వచ్చారు. ఒక 10-20 సెకన్లు అయితే పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఏకంగా 90 సెకన్లు ఆలస్యంగా ఎవరూ రారు. తక్కువ బంతులు ఎదుర్కోవడానికి దాదాపు ప్రతి జట్టు ఇలా చేస్తుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్యాటర్‌కు బంతి తగిలితే ఫిజియోను పిలిస్తే ఓకే. అంతేకానీ, ఇలా కావాలని 90 సెకన్లు లేటుగా క్రీజులోకి రావడం క్రీడాస్ఫూర్తిగా విరుద్ధం’ అని గిల్ తేల్చిచెప్పాడు.

Next Story