రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా

by Harish |

రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ జట్టు మళ్లీ అదరగొట్టింది. రెండో టెస్టులోనూ పాకిస్తాన్‌ను చిత్తు చేసి టెస్టు సిరీస్‌ను 2-0‌తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో బంగ్లా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 278 రన్స్ చేయగా.. పాక్ 232 స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్ లీడ్(46 రన్స్) కలుపుకుని పాక్ ముందు 437 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. చేజింగ్‌లో పాక్ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఓవర్‌నైట్ స్కోరు 316/7‌తో చివరి రోజైన బుధవారం ఆట కొనసాగించిన పాక్‌ను బంగ్లా ఎంతో సేపు ఆడనివ్వలేదు. 42 రన్సే చేసి ఆఖరి 3 వికెట్లు తీసింది. దీంతో పాక్ 358 పరుగులకే ఆలౌటైంది. రిజ్వాన్(94), సల్మాన్ అఘా(71), షాన్ మసూద్(71) పోరాడినప్పటికీ పాక్‌ను గెలిపించలేకపోయారు. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ తన స్పిన్ మాయతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 6 వికెట్లతో విజృంభించి పాక్ పతనాన్ని శాసించాడు. 2024‌లో పాక్‌‌ను బంగ్లా వారి గడ్డపైనే వైట్‌వాస్ చేసింది. ఇప్పుడు సొంతగడ్డపై పాక్‌‌ను మట్టికరిపించింది. బంగ్లాలో పాక్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. పాక్‌పై వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను బంగ్లా గెలవడం విశేషం.


Next Story