Syed Modi International: సెమీస్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. తన్వి, ఉన్నతి కూడా

by Harish |

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌కు దూసుకెళ్లాడు.

Syed Modi International: సెమీస్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. తన్వి, ఉన్నతి కూడా
X

దిశ, స్పోర్ట్స్ : లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ప్రత్యర్థి మరో భారత ప్లేయర్ ప్రియాన్ష్ రజావత్ రిటైర్డ్ అవడంతో అతను తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు. రజావత్ వైదొలగకముందు తొలి గేమును శ్రీకాంత్ 21-14తో గెలిచాడు. రెండో గేములోనూ 11-4తో ఆధిక్యంలో నిలిచాడు. రెండో గేము మధ్యలో రజావత్ గాయపడి తప్పుకోవడంతో శ్రీకాంత్ నేరుగా సెమీస్‌కు చేరుకున్నాడు. మరో భారత యువ షట్లర్ మంజునాథ్ కూడా ముందడుగు వేశాడు. క్వార్టర్స్‌లో సహచరుడు మాన్‌రాజ్ సింగ్‌పై 21-18, 21-13 తేడాతో విజయం సాధించాడు. సెమీస్‌లో శ్రీకాంత్, మంజునాథ్ తలపడనున్నారు.

ఇక, ఉమెన్స్ సింగిల్స్‌లో 16 ఏళ్ల యువ సంచలనం తన్వి శర్మ కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె 21-13 21-19 తేడాతో హాంకాంగ్‌కు చెందిన సిన్ యాన్ హ్యాపీ లో‌ను మట్టికరిపించింది. 38 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన తన్వి వరుసగా రెండు గేముల్లోనూ విజయం సాధించింది. మరో యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా 21-15, 13-21, 21-16 తేడాతో సహచర క్రీడాకారిణి రక్షితశ్రీపై గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మరోవైపు, మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ టైటిల్ దిశగా సాగుతోంది. క్వార్టర్స్‌లో 21-15, 21-16 తేడాతో తుర్కియే బెంగిసు ఎర్సెటిన్-నజ్లికన్ ఇన్సి జంటప విజయం సాధించింది. 42 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థుల నుంచి గాయత్రి జంటకు పోటీ ఎదురైంది. కానీ, ఏ మాత్రం పట్టుదల కోల్పోయిన భారత షట్లర్లు రెండు గేముల్లోనూ పైచేయి సాధించారు.

Next Story