వరల్డ్ కప్ కోసం అయ్యర్ అంత పనిచేశాడా?.. సంచలన విషయాలు వెలుగులోకి

by Dishanational3 |
వరల్డ్ కప్ కోసం అయ్యర్ అంత పనిచేశాడా?.. సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నరన్న కారణంతో ఇషాన్ కిషన్‌, అయ్యర్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, అయ్యర్ గురించి ఓ జాతీయ మీడియా సంస్థ సంచలన విషయాలను బయటపెట్టింది. వన్డే వరల్డ్ కప్ కోసం అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉన్నాడని, గాయంతోనే ప్రపంచకప్ ఆడాడని రాసుకొచ్చింది.

సదరు మీడియా సంస్థ కథనం ప్రకారం.. ‘అతను వరల్డ్ కప్ కోసం ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. సర్జరీ తర్వాత కూడా వరల్డ్ కప్ కోసం అతను నొప్పి లేకుండా ఉండటానికి మూడు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు తీసుకున్నాడు. సెమీస్, ఫైనల్‌లో అయ్యర్‌గా నొప్పి వచ్చినా అలాగే ఆడాడు. ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి లేకుండా ఆడింది అయ్యర్ మాత్రమే. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు.’ అని సదరు మీడియా సంస్థ రాసుకొచ్చింది.

అలాగే, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అయ్యర్ కేకేఆర్ అకాడమీలో చేరాడని సదరు మీడియా సంస్థ పేర్కొంది. ‘జనవరిలో రంజీలు ఆడాలని అతనికి చెప్పారు. ఒక ఆటగాడు తనకు నచ్చిన కోచ్‌ కింద శిక్షణ పొందే స్వేచ్ఛ లేదా?. మొదట్లో ప్రాక్టీస్ సెషన్‌లో 60 బంతులు ఆడితేనే వెన్ను నొప్పితో బాధపడేవాడు. ఇప్పుడు ఒక సెషన్‌లో అతను 200 బంతులను ఎదుర్కొంటున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై టీమ్ హెడ్ కోచ్ ఉచ్చులో ఉన్నారు. అయ్యర్ పురోగతిని పర్యవేక్షించడానికి ముంబై కోచ్ పలుమార్లు కేకేఆర్ అకాడమీకి వచ్చాడు.’ అని సదరు మీడియా సంస్థ చెప్పుకొచ్చింది. దీంతో అయ్యర్‌కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయ జట్టు కోసం ఐపీఎల్‌ను కూడా త్యాగం చేసిన అయ్యర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్‌లో అయ్యర్ సత్తాచాటిన విషయం తెలిసిందే. 11 మ్యాచ్‌ల్లో 66.25 సగటుతో 530 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ(765), రోహిత్ శర్మ(597) తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్ అయ్యరే. అయ్యర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. తమిళనాడుతో జరుగుతున్న సెమీస్‌లో బరిలోకి దిగాడు.


Next Story