బంగ్లాదేశ్ నుంచి అందుకే వచ్చాను.. బీపీఎల్‌ను వీడటంపై షోయబ్ మాలిక్ క్లారిటీ

by Dishanational5 |
బంగ్లాదేశ్ నుంచి అందుకే వచ్చాను.. బీపీఎల్‌ను వీడటంపై షోయబ్ మాలిక్ క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడం, పాక్ నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకోవడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర చర్చ జరుగుతుంది. తాజాగా అతను మరోసారి వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఫార్చూన్ బరిషల్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫ్రాంచైజీ అతనితో కాంట్రాక్ట్ రద్దు చేసిందని ప్రచారం జరిగింది. అతను టోర్నీ నుంచి వైదొలగడం ఈ వార్తలకు బలాన్నిచ్చింది. తాజాగా తనపై వచ్చిన వార్తలను షోయబ్ మాలిక్ కొట్టిపారేశాడు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన అతను.. తనపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అని తెలిపాడు. ‘ఫార్చూన్ బరిషల్ జట్టు నా కాంట్రాక్ట్‌ను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. నేను మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా. దుబాయ్‌లో మీడియాతో ముందస్తు ఒప్పందాల్లో భాగంగానే నేను బంగ్లాదేశ్ నుంచి వచ్చాను. తర్వాతి మ్యాచ్‌ల కోసం ఫార్చూన్ బరిషల్ జట్టుకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. నా అవసరం ఉంటే కచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఇటీవల నాపై నిరాధారణమైన వార్తలు వస్తున్నాయి. వాటిని ఖండించడం ముఖ్యం. వాస్తవాలు తెలుసుకుని కథనాలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని షోయబ్ మాలిక్ రాసుకొచ్చాడు. కాగా, ఈ నెల 22న ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలోనే అతనిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.


Next Story

Most Viewed