ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట

by Dishanational3 |
ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. శుక్రవారం మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. అందులో రెండు స్వర్ణాలతో సహా రజతం, కాంస్యం ఉన్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అఖిల్ షెరాన్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 586 స్కోరుతో 6వ స్థానంలో అఖిల్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్‌లో 460.2 స్కోరుతో విజేతగా నిలిచాడు. ఇదే కేటగిరీలో మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 459.0 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. అఖిల్ ఇప్పటికే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కేటగిరీలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అఖిల్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, కుసాలే స్వప్నిల్‌లతో కూడిన భారత త్రయం 1,758 స్కోరుతో విజేతగా నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ కేటగిరీలో ఆదర్శ్ సింగ్(290), విజయ్‌వీర్(280), గుర్‌ప్రీత్ సింగ్‌(287)లతో కూడిన భారత జట్టు 857 స్కోరుతో కాంస్య పతకం గెలుచుకుంది. కొరియా టీమ్ స్వర్ణం నెగ్గగా.. వియత్నం టీమ్ రజతం సాధించింది. ఈ టోర్నీ మెడల్ స్టాండింగ్స్‌లో భారత్ 26 పతకాలతో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇందులో 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

Next Story