పాకిస్తాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ల ఆతిథ్యానికి నిరాకరణ

by Harish |
పాకిస్తాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ల ఆతిథ్యానికి నిరాకరణ
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) షాకిచ్చినట్టు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) మిగతా సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని పీసీబీ ప్రకటించింది. అయితే, పీసీబీ అభ్యర్థనను ఈసీబీ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.

పీఎస్‌ఎల్‌లో చివరి ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని శుక్రవారం ఉదయమే పీసీబీ ప్రకటించింది. అందులో ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే, పీఎస్‌ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడానికి ఈసీబీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న పరిస్థితుల్లో పాక్‌తో జతకట్టడం సరైంది కాదని ఈసీబీ భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈసీబీ, బీసీసీఐకి మంచి సంబంధాలు ఉన్నాయి.

కరోనా సమయంలో ఐపీఎల్ పూర్తిగా యూఏఈ వేదికగానే జరిగిన విషయం తెలిసిందే. అలాగే, 2014, 2021లో కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లో దుబాయ్‌లో జరిగాయి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌కు ఆతిథ్యమివ్వడం వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయని యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీబీ తిరస్కరణ పీసీబీ భారీ షాకే అని చెప్పొచ్చు. ఈసీబీ ఇచ్చిన షాక్‌తో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పీఎస్‌ఎల్ నిరవధికంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. పీసీబీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.



Next Story

Most Viewed