ఆ సిరీస్ తర్వాత మనసు చెడింది.. ఆడలేకపోయా..: సంజూ

by Phanindra |

ఆ సిరీస్ తర్వాత మనసు చెడిందని, సరిగా ఆడలేకపోయానని సంజూ శాంసన్ చెప్పాడు. అయితే గంభీర్‌తో మాట్లాడేటప్పటికి అంతా సర్దుకుందన్నాడు.

ఆ సిరీస్ తర్వాత మనసు చెడింది.. ఆడలేకపోయా..: సంజూ
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన భారత స్టార్ సంజూ శాంసన్.. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడాడు. కేరళకు తిరిగొచ్చిన అతనికి ఎయిర్‌పోర్టులో అద్భుతమైన స్వాగతం లభించింది. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్న సంజూ.. ‘అంతా నా బుర్రలో ఉన్నదే. కివీస్‌తో సిరీస్ తర్వాత నా కలలన్నీ ముక్కలైపోయినట్లు ఫీలయ్యా. దేవుడు వేరే ప్లాన్ వేశాడేమో తెలియదు. కానీ కివీస్‌తో సిరీస్ తర్వాత అసలు ఆడలేకపోయా. సంతోషంగా లేకపోవడంతో బెడ్ మీద నుంచి లేవలేకపోయా. ఎమోషన్స్‌లో కొట్టుకుపోయా. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితిని స్వీకరించా. అప్పుడు కొంచెం త్వరగా కోలుకున్నా’ అని వివరించాడు.

గంభీర్ ఉంచిన నమ్మకం..

అలాగే వరల్డ్ కప్‌లో జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత గంభీర్‌ని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘జింబాబ్వే మ్యాచ్ తర్వాత గౌతీ భాయ్‌ని జిమ్‌లో కలిశా. అప్పుడే ‘సంజూ.. నెక్స్ట్ గేమ్ నువ్వు ఆడుతున్నావ్’ అన్నాడు. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా’ అని వెల్లడించాడు. అలాగే జట్టులో స్థానం కోసం తోటి ఆటగాళ్లతో పోటీ పడుతుంటే తాను మంచి ప్రదర్శన ఇవ్వలేనని, జట్టుతో కలిసి ఒక లక్ష్యం కోసం పోరాడేటప్పుడు రాణిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచులే ఆడిన సంజూ 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేటుతో 321 పరుగులు చేశాడు. అంతేకాదు 24 సిక్సర్లు, 27 ఫోర్లు బాదాడు. టీ20 వరల్డ్ కప్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా కోహ్లీ (319) రికార్డును బద్దలుకొట్టాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో సంజూకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Next Story