తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్ ఔట్..

by Disha Web Desk 13 |
తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్ ఔట్..
X

పారిస్: భారత స్టార్ మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి నిరాశపర్చింది. కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతవుతున్న సైనా.. తాజాగా ఓర్లియన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. బుధవారం ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 16-21, 14-21 తేడాతో టుర్కియో క్రీడాకారిణి నెస్లిహాన్ యిగిట్ చేతిలో పరాజయం పాలైంది. 39 నిమిషాల మ్యాచ్‌లో సైనా ప్రత్యర్థిని ఏ దశలోనూ నిలువరించలేకపోయింది. మరో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ 8-21, 21-13, 8-21 తేడాతో నట్సుకి నిడైరా(జపాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. మరో భారత క్రీడాకారిణి తన్య హేమంత్ మాత్రం టోర్నీలో ముందడుగు వేసింది.

ఫ్రాన్స్‌కు చెందిన లియోనిస్ హ్యూట్‌పై 21-17, 21-18 తేడాతో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్‌లో మిథున్ మంజునాథ్ తొలి రౌండ్‌లో అద్భుత విజయం సాధించాడు. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ స్వెండ్‌సెన్‌‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ను 24-22, 25-23 తేడాతో గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రియాన్ష్ రజావత్ 21-18, 21-13 తేడాతో సహచర ఆటగాడు కిరణ్ జార్జ్‌పై నెగ్గాడు. సమీర్ వర్మ 21-19, 19-21, 17-21 తేడాతో నాట్ న్గుయెన్(ఐర్లాండ్) చేతిలో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.



Next Story

Most Viewed