క్రికెట్ దిగ్గజం సచిన్‌కు అరుదైన గౌరవం.. ఆ నలుగురి తర్వాత అతనే

by Harish |

క్రికెట్ దిగ్గజం సచిన్‌కు అరుదైన గౌరవం.. ఆ నలుగురి తర్వాత అతనే
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ రూల్స్‌ను రూపొందించే మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మ్యూజియంలో సచిన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. లార్డ్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ చిత్రపటాన్ని స్టువర్ట్ పియరన్స్ రైట్ వేశారు. ముంబైలోని సచిన్ ఇంటిలో ఉన్న 18 ఏళ్ల నాటి ఫొటో ఆధారంగా ఆధారంగా ఆయిల్ పెయింట్స్‌తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివరి వరకు సచిన్ చిత్రపటం మ్యూజియంలో ఉంటుంది. ఆ తర్వాత పెవిలియన్‌కు మార్చుతారు. ఎంసీసీ కలెక్షన్స్‌లో సచిన్‌ది 5వ చిత్రపటం. ఇంతకుముందు కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కర్ల చిత్రపటాలను ఉంచారు. ఎంసీసీలో మొత్తం 3,000 ఫొటోలు ఉన్నాయి. అలాగే, లార్డ్స్ స్టేడియంలో ఉన్న గంటను మోగించే గౌరవం కూడా సచిన్‌కు దక్కింది. గంటను మోగించి మూడో టెస్టును ప్రారంభించాడు. లార్డ్స్ స్టేడియంలో 2007 నుంచి గంటను మోగించి మ్యాచ్‌ను ప్రారంభించడం సంప్రదాయం. ముఖ్యమైన వ్యక్తులతో మాత్రమే బెల్‌ను మోగిస్తారు. ఇప్పటివరకు భారత్ నుంచి సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ ఈ బెల్‌ను మోగించగా.. తాజాగా సచిన్ వారి జాబితాలో చేరాడు.

చాలా గొప్ప గౌరవం : సచిన్

ఎంసీసీ మ్యూజియంలో తన చిత్రపటాన్ని ఆవిష్కరించడంపై సచిన్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమన్నాడు. 1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు తొలిసారిగా లార్డ్స్ స్టేడియానికి వచ్చానని, మా కెప్టెన్ కపిల్ దేవ్ టైటిల్ అందుకుంటే చూశానని చెప్పాడు. ఆ క్షణం తన క్రికెట్ జర్నీకి స్ఫూర్తినిచ్చిందని తెలిపాడు. ఇప్పుడు తన చిత్రపటం పెవిలియన్‌లో ఉంచడం తన జీవితం పరిపూర్ణం అయిందనిపిస్తుందని చెప్పాడు.


Next Story