స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో క్వార్టర్స్‌కు సచిన్, సాగర్

by Dishanational3 |
స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో క్వార్టర్స్‌కు సచిన్, సాగర్
X

దిశ, స్పోర్ట్స్ : బల్గేరియాలో జరుగుతున్న 75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్, సాగర్ మంగళవారం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. 92+ కేజీల కేటగిరీలో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ సాగర్ 5-0 తేడాతో లిథువేనియా బాక్సర్ జోనస్‌ను మట్టికరిపించాడు. ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన అతను మ్యాచ్‌‌ను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. క్వార్టర్స్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ జికిరోవ్ జఖోంగిర్‌తో సాగర్ తలపడనున్నాడు. 57 కేజీల విభాగంలో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సచిన్ 3-2 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫైజోవ్‌ను చిత్తు చేశాడు. ఈ బౌట్‌లో మొదటి ఫైజోవే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రౌండ్‌లో అతనిదే పైచేయి. రెండో రౌండ్‌లో పుంజుకున్న సచిన్ ప్రత్యర్థి పంచ్‌ల దాడికి దిగాడు. మూడో రౌండ్‌లోనే అదే జోరు కనబర్చి విజేతగా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్‌లో జార్జియా బాక్సర్ కపనాడ్జే జార్జితో సచిన్ తలపడనున్నాడు. మరో భారత బాక్సర్ వంశాజ్ 63.5 కేజీల విభాగంలో తన పోరాటాన్ని ముగించాడు. ప్రీక్వార్టర్స్‌ బౌట్‌లో ఇరాన్ బాక్సర్ హబీబినెజాద్ అలీ చేతిలో 3-2 తేడాతో పోరాడి ఓడాడు. బుధవారం అమిత్ పంఘల్(51 కేజీలు), ఆకాశ్(71 కేజీలు), దీపక్(75 కేజీలు) ప్రీ క్వార్టర్స్ బౌట్‌ ఆడనున్నారు.

Next Story

Most Viewed